లక్నో: పిల్లవాడ్ని ఎత్తుకుని ఉన్న వ్యక్తిని కొట్టిన పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. స్థానిక ఆసుపత్రి వద్ద నిరసన చేస్తున్న వ్యక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో బాబును ఎత్తుకుని ఉన్న వ్యక్తిని ఇన్స్స్పెక్టర్ వినోద్ కుమార్ మిశ్రా లాఠీతో కొట్టాడు. పిల్లవాడికి లాఠీ తగులుతుందని, దెబ్బలు తగిలితే బాబు చనిపోతాడంటూ ఆ వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. మరొక పోలీస్ ఆ వ్యక్తి నుంచి పిల్లవాడిని లాగేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘పటిష్ఠమైన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అంటే పోలీసులంటే భయం కాదు, చట్టం పట్ల భయాన్ని రేకెత్తించాలి. బలహీనులకు న్యాయం జరిగేలా పటిష్ఠమైన శాంతిభద్రతలు అవసరం’ అని పేర్కొన్నారు.
మరోవైపు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు. ఇన్స్స్పెక్టర్ వినోద్ కుమార్ మిశ్రాను కాన్పూర్ ఏడీజీ సస్పెండ్ చేశారు.