న్యూఢిల్లీ: సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని తరచూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేసింది. నిత్యం ఏదో ఒక వివాదం రాజేస్తున్న కంగనా నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్రపతికి DSGMC లేఖ రాసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ముఖ్యంగా సిక్కులను లక్ష్యంగా చేసుకుని కంగనా ఒకటి తర్వాత ఒకటి వివాదాలు సృష్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నది.
1984 నాటి సిక్కుల ఊచకోతను సమర్థిస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఖలిస్థానీలకు వ్యతిరేకంగా మంచి నిర్ణయం తీసుకున్నారని కంగన వ్యాఖ్యానించారని, అంతేగాక తాను ఖలిస్థానీలను దోమలను నలిపేసినట్లు నలిపేస్తానన్నారని రాష్ట్రపతికి రాసిన లేఖలో DSGMC గుర్తుచేసింది. సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న ఓ సిక్కు రైతు తల్లిని కూడా కంగనా అవమానించారని, ఆమె కేవలం రూ.100 కోసం ఆందోళన పాల్గొన్నదని కించపర్చారని పేర్కొన్నారు. అంతేగాక స్వాతంత్ర్య సమరయోధులైన భగత్సింగ్, సుఖదేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లను అవమానించేలా వ్యాఖ్యానించారని, దేశానికి స్వాతంత్ర్యం అడుక్కుంటే వచ్చిందని అన్నారని DSGMC రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.