Eshwarananda Puri Swamiji | బెంగళూరు : కురుబ సామాజిక వర్గానికి చెందిన కనక గురు పీఠం అధిపతి ఈశ్వరానంద పురి స్వామీజీ శుక్రవారం రాత్రి జరిగిన కన్నడ సాహితీ సదస్సులో సంచలన ఆరోపణలు చేశారు. 2023 డిసెంబరులో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాను చిత్రదుర్గ జిల్లాలోని బాగూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయానికి వెళ్లి, స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. తాను అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయిన తర్వాత అధికారులు ఆ దేవాలయాన్ని పూర్తిగా కడిగినట్లు తనకు తెలిసిందన్నారు.
ఈ దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోనిదేనని తనకు తెలిసి ఉంటే, తాను ధర్నా చేసి ఉండేవాడినన్నారు. ఆ దేవాలయం అర్చకుని కుటుంబంలోని మహిళలను తన కన్నా ముందు లోపలికి అనుమతించారన్నారు. తాను కూడా హిందూ మఠాధిపతినే అయినప్పటికీ తనను బయట వేచి ఉండేలా చేశారని ఆరోపించారు.
ఇకపై తాను అన్ని దేవాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, దాని వల్ల అవి శుభ్రపడతాయని అన్నారు. కానీ బాగూరులోని చెన్నకేశవ దేవాలయానికి మాత్రం వెళ్లబోనని తెలిపారు. దీనిపై చెన్నకేశవ దేవాలయం పూజారి శ్రీనివాస్ విలేకర్లతో స్పందిస్తూ.. ఈశ్వరానంద స్వామీజీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, స్వామివారిని దర్శనం చేసుకుంటారని, ఈసారి ఆయన వచ్చినపుడు దేవాలయాన్ని కడగడం వంటి సంఘటనలేవీ జరగలేదని చెప్పారు.