న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు గత మూడు రోజులుగా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఢిల్లీలోని కమల్ నాథ్ ఇంటిపై శనివారం కనిపించిన ‘జై శ్రీరామ్’ జెండాను సోమవారం తొలగించారు. అలాగే ఆయన బీజేపీలో చేరడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి కమల్ నాథ్ను తొలగించడంపై ఆయన కలత చెందారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. శనివారం కమల్ నాథ్ ఢిల్లీకి రావడంతో బీజేపీ నేతలను కలుస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్లో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడంతో ఈ వదంతులు తారాస్థాయికి చేరాయి.
కాగా, కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కమల్ నాథ్ బీజేపీలో చేరడం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఆదివారం తెలిపారు. తాను ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే కమల్ నాథ్కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మధ్యప్రదేశ్లోని చింద్వారా నియోజకవర్గంలో ఆయన కోసం ప్రచారం చేసినప్పుడు తన మూడవ కొడుకుగా పిలిచారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అలాగే ఆయన తొమ్మిది సార్లు ఎంపీగా, సీఎంగా ప్రాతినిధ్యం వహించినట్లు వెల్లడించింది.