న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ శనివారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత నెల 4 నుంచి ఆయన ఢిల్లీలోని సంజయ్గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్)లో చికిత్సపొందుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనకు డయాలసిస్ చేస్తూ వచ్చారు. స్టెప్సిస్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో శనివారం తుదిశ్వాస విడిచారు. 1991 జూన్ నుంచి 1992 డిసెంబరు వరకు, 1997 సెప్టెంబరు నుంచి 1999 నవంబరు వరకు రెండుసార్లు ఆయన యూపీ సీఎంగా పనిచేశారు. 1992 డిసెంబరు 26న అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయనే సీఎంగా ఉన్నారు. ఆ ఘటన జరిగిన రోజే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. రెండోసారి సీఎం అయిన రెండేండ్లకు ఆయనతో బీజేపీ నాయకత్వం రాజీనామా చేయించింది. దీంతో ఆయన పార్టీని వీడారు. మళ్లీ 2004లో తిరిగి బీజేపీలోకి వచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషితో పాటు కల్యాణ్ సింగ్ విచారణను ఎదుర్కొన్నారు. తర్వాత వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్ గవర్నర్గా కల్యాణ్ సింగ్ పనిచేశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
కల్యాణ్సింగ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.