Kalyan Banerjee : ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్గా చెప్పుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ప్రధాని తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారు కానీ సినిమా అంతా ఫ్లాప్ అయ్యిందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు.
కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై బెనర్జీ విమర్శలు చేశారు. ప్రధాని మోదీ 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారని, గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తని, ఆయన ఒక నకిలీ నటుడని, ప్రజలు నకిలీ నటుడు మోదీకి, ఆయన పార్టీ బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పారు.
ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారని, సినిమా కూడా సక్సెస్ కాబోదని, మోదీ ఇక గుజరాత్కు వెళ్లిపోవాల్సిందేనని కల్యాణ్ బెనర్జి అన్నారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం నడవదని, విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దని చెప్పారు. కాగా గత జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెద్ద సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదం అయ్యారు.