Kailash Satyarthi: అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఈ రోజు చారిత్రకమైన రోజు అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి (Kailash Satyarthi) వ్యాఖ్యానించారు. సోమవారం అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం యుద్ధాలు, హింస నుంచి బయటపడాలన్నారు. అలా చేయడమే మన బాధ్యతని, ఇదే అయోధ్య సందేశమని, ఇది కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు.
శ్రీరాముడు మానవాలికి ఆదర్శమని, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు కరుణ, సోదర భావం, న్యాయంతో జీవించాలని కైలాస్ సత్యార్థి సూచించారు. కాగా, అయోధ్య రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలిచారు.
మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామి వారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.