కోల్కతా : పల్లీలు అమ్ముకుంటూ తనదైన గొంతుతో కచ్చా బాదం పాట పాడి ప్రాచుర్యం పొందిన భుదన్ బద్యకర్ ఓవర్నైట్ సెన్సేషన్గా మారారు. తన ట్యూన్కు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ ఏడాది మేలో కారు ప్రమాదంలో గాయపడిన బద్యకర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.
బద్యకర్ తన ప్రతిభకు మళ్లీ పదును పెట్టుకుంటూ న్యూ ఆల్బమ్తో అభిమానులను పలకరించేందుకు సన్నద్ధమయ్యాడు. మూడు పాటలతో కూడిన కొత్త ఆల్బమ్ను అందించనున్నాడు. వీటిలో మారిన తన జీవనశైలిని ఉద్దేశించిన పాట ఒకటని ఆయన చెప్పుకొచ్చాడు. తనకు సమయం లేనందున తానింక పల్లీలు అమ్మాలనుకోవడం లేదని అంటూ అనూహ్యంగా మారిన తన జీవనశైలికి అద్దం పట్టే పాటతో ఆయన ప్రజల ముందుకు రానున్నాడు.
తానిక పల్లీలను అమ్మబోనని అంటూ అదే తన తాజా ఆల్బమ్ పేరని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన పాట తన జీవితానికి అద్దం పడుతుందని అన్నాడు. తనకు ఇప్పుడు కారు, సొంత ఇల్లూ, చుట్టూ అందమైన మహిళలు ఉన్నారని అంటున్నాడు. వీటన్నింటిని తన న్యూ ఆల్బమ్లో పొందుపరిచానని చెబుతున్నాడు. తనను తాను సెలబ్రిటీగా భావిస్తున్నానని ప్రజలు తన పాటలను వినాలని కోరుకుంటున్నానని అన్నాడు.