కపుర్తలా: పంజాబ్లోని కపుర్తలా జిల్లాలో ఓ యువ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కబడ్డీ ప్లేయర్ను దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని అతని ఇంటి ముందుకు తీసుకొచ్చి పడేశారు. పైగా అతని ఇంటి తలుపులు తట్టి తల్లిదండ్రులను నిద్ర లేపారు. మీ కొడుకును చంపేశామని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. చాలా రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా జిల్లాకు చెందిన హర్దీప్సింగ్ (22) కబడ్డీ ఆటగాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటి ముందే పడేశారు. అంతటితో ఆగక హర్దీప్ పేరెంట్స్ను తలుపు తట్టి నిద్రలేపారు. తలుపు తీసి బయటికి వచ్చిన హర్దీప్ తండ్రికి నీ కొడుకును కొట్టి చంపేశాం అని చెప్పి పారిపోయారు.
దుండగులు వెళ్లిపోగానే తల్లిదండ్రులు, స్థానికులు కలిసి హర్దీప్ను బతికున్నాడేమోనని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. హర్దీప్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో హర్దీప్కు ఉన్న పాత గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.