సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మమత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో మౌలిక వసతుల కల్పన చేద్దామని తాము భావిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో రెండో విమానాశ్రయం కట్టాలని కేంద్రం భావించిందని, భూమి ఇవ్వడానికి మమత సర్కార్ ఏమాత్రం ముందుకు రావడం లేదని సింధియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘ప్రస్తుతం ఉన్న నేతాజీ విమానాశ్రయం కెపాసిటీ పూర్తైంది. పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నా… ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. ఈ విషయమై నేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి గత 6 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. అయినా సీఎం మమత సమయం ఇవ్వడం లేదు’ అని సింధియా ఆరోపించారు. ఎయిర్పోర్ట్ నిర్మించడానికి తాము సిద్ధమని, ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే ఎలా కట్టాలని సింధియా ప్రశ్నించారు.