ఇండోర్, జూలై 2: బాల నేరస్థుల చట్టం(జువనైల్ జస్టిస్ యాక్ట్) అసంబద్ధంగా ఉందని, నేరస్థులకు తీవ్రమైన నేరాలు చేసేందుకు అది అవకాశం కల్పిస్తున్నదని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్కు చెందిన మైనర్ను అత్యాచారం చేసిన కేసులో ఒక 16 ఏండ్ల నిందితుడికి బెయిల్ ఇచ్చే విషయమై కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. అతడికి బెయిల్ నిరాకరిస్తూ.. చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు గాను ఈ చట్టం ఏమాత్రం సరిపోదని కోర్టు తెలిపింది. ఇంకెంతమంది ‘నిర్భయ’ (లైంగికదాడి బాధితురాళ్లు) తమ జీవితాన్ని త్యాగం చేస్తే ఈ దేశంలోని చట్టసభ్యులు మేల్కొంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నుంచి చట్టసభ్యులు ఏమీ నేర్చుకోలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. జువనైల్ జస్టిస్ యాక్ట్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని 16 ఏండ్ల కంటే వయసు తక్కువ ఉన్నవాళ్లు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.