న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్కుమార్తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజేఐ చంద్రచూడ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 32కు చేరింది. పూర్తిస్థాయి భర్తీకి ఇంకా ఇద్దరిని నియమించాల్సి ఉంది. అయితే వీరి నియామకానికి కూడా ఇప్పటికే కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు.
మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది ఎల్సీ విక్టోరియా గౌరి నియామకాన్ని కేంద్రం ఆమోదించింది. అయితే ఈ నియామకంపై వివాదం నెలకొన్నది. విక్టోరియా గౌరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, గతంలో ఆమె ముస్లింలు, క్రిస్టియన్లకు వ్వతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె నియామక సిఫారసును వెనక్కు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు గతంలో సుప్రీంకోర్టు కొలీజియంతో పాటు రాష్ట్రపతికి లేఖ రాశారు. కాగా, విక్టోరియా గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై మంగళవారం అత్యవసర విచారణకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ముందుగా శుక్రవారం విచారిస్తామని బెంచ్ పేర్కొనగా.. నియామకం అంశాన్ని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో పిటిషన్ను మంగళవారానికి లిస్టింగ్ చేసింది. కాగా, విక్టోరియా గౌరితోపాటు 11 మంది న్యాయవాదులను వివిధ హైకోర్టుల అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.