న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. అయితే విచారణ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న(Justice Nagarathna) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆర్టికల్ 17ని ప్రస్తావించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో మూడు రోజులు మహిళలను అంటరానివారిగా చూడలేమని, నాలుగో రోజు అస్పృశ్యత లేదని చెప్పడం సరికాదన్నారు. ఆర్టికల్ 17 కేవలం ఆ మూడు రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం తరపున వాదనలు వినిపిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 2018 నాటి శబరిమల తీర్పును ప్రస్తావించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించకపోవడం ఒకరమైన అంటరానితనమే అవుతుందని ఆ తీర్పులో చెప్పారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పటి సీజే చంద్రచూడ్ అన్నారన్నారు. అయితే తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న తప్పుపడుతూ.. శబరిమల కేసులో ఆర్టికల్ 17 అప్లై అవుతుందంటే అప్పుడు మహిళలను అంటరానివారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
శబరిమల కేసు వాదిస్తున్న ధర్మాసనంలో.. జస్టిస్ నాగరత్న ఒక్కరే మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. శబరిమల కేసులో ఎలా ఆర్టికల్ 17 గురించి వాదించారో అర్థం కావడం లేదని, ఓ మహిళగా ఆలోచిస్తే, ప్రతి నెల మూడు రోజుల పాటు అస్పృశ్యత ఉండదని, ఇక నాలుగో రోజు అంటరానివాళ్లం కాదన్న భావన సరైంది కాదన్నారు. అయితే తానేమీ రుతుక్రమ సమస్య గురించి మాట్లాడడం లేదని తుషార్ మెహతా క్లారిటీ ఇవ్వబోయారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది రుతుక్రమ సమస్యకు సంబంధించినది కాదు అని, కేవలం వయసు సంబంధిత అంశమే అని మెహతా అన్నారు. తన వాదన తనకు మాత్రమే అని, ఇది 4 రోజులకు సంబంధించినది కాదు అని, ఇది ఆ వయసు గ్రూపుకు సంబంధించినదన్నారు.