న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ కేసుల పెండింగ్, తీవ్ర జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న విచారం వ్యక్తం చేశారు. న్యాయ వితరణ వ్యవస్థను కాపాడేందుకు న్యాయవాదుల వర్గం(బార్) తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని, తమ పాత్రను పునరాలోచించుకోవాలని, ఒకే గొంతుతో మాట్లాడాలని పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ) 13వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన జస్టిస్ నాగరత్నం బార్ కౌన్సిల్ తన సభ్యుల గౌరవాన్ని పొందలేనప్పుడు అది న్యాయవాద వృత్తికి మంచి సంకేతం కాదని పేర్కొన్నారు. వృత్తి పరమైన నైతికత, సామర్థ్యాన్ని నిలబెట్టడంలో బార్ కౌన్సిళ్లు తమ పాత్ర, ప్రాముఖ్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు.
అలాగే బాధిత కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో తమ విధులపై బార్ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. ‘ఈ దేశ న్యాయవాదులు మన రాజ్యాంగ విలువల దివిటీలు. బార్ చేసే ఏవైనా లోపాలు లేదా పొరపాట్లు మన రాజకీయ పౌర జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే మన సమాజంలో వారికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. బార్లోని ప్రతి సభ్యుడు తమ మనస్తత్వాన్ని మార్చుకోవాలని, భవిష్యత్తులో తమ వాదనల పట్టును కోల్పోకుండా ఉండేందుకు, తమ క్లయింట్ల కోసం ప్రజాసేవగా పనిచేయాలని వినమ్రంగా గుర్తు చేస్తున్నాను. అలా చేయకపోతే అది మన న్యాయ వ్యవస్థను, చట్టబద్దమైన పాలనను పరిరక్షించడానికి బదులు వినాశకరంగా మారుతుంది’ అని జస్టిస్ నాగరత్న హెచ్చరించారు. బార్ తన జ్ఞా నాన్ని, విచక్షణను చట్టబద్దమైన పాలన సేవలో ఉపయోగించాలన్నారు. జాతీ యోద్యమంలో న్యాయవాద వృత్తి కీలక పాత్ర పోషించిందని ఆమె అన్నారు.