న్యూఢిల్లీ: అతనో జూనియర్ ఇంజినీర్. ప్రముఖ విద్యుత్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఆదివారం ఆయన పుట్టిన రోజు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. చూస్తే జేబులో పైసల్లేవు. దీంతో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే రెండు రోజుల్లోనే, అదికూడా తన పుట్టిన రోజునే పోలీసులకు చిక్కిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని జ్యోతి నగర్కు చెందిన మోహిత్ గౌతమ్.. బీఎస్ఈఎస్ విద్యుదుత్పత్తి కంపెనీలో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అయితే జూలై 25న అతని పుట్టిన రోజు. అయితే నెలాఖరు కావడంతో చేతిలో పైసా లేదు. దీంతో గత శుక్రవారం మానససరోవర్ పార్క్ వద్ద ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను అడ్డగించి.. ఆమె చెవి రింగులను ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పార్కు చుట్టు పక్కల ఉన్న కెమెరాలను పరిశీలించారు. దొంగతనానికి పాల్పడినప్పుడు అతడు వాడిన బైక్ నంబర్ ప్లేట్లపై నంబర్ లేకుండా ఉండటాన్ని గమనించారు. అదేవిధంగా బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గౌతమ్ తన పుట్టిన రోజైన ఆదివారం.. జగత్పురిలోని వైన్ షాప్కు వెళ్లాడు. నంబర్ లేకుండా ఉన్న బండిని పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తాను జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నానని, పుట్టిన రోజును జరుపుకోవడానికి డబ్బు కోసమే దొంగతనానికి పాల్పడినట్లు చెప్పాడు. చెవి రింగులను అమ్మేశానని వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఆ గోల్డ్ స్మిత్కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.