లక్నో: గ్యాంగ్స్టర్-రాజకీయవేత్త ముక్తార్ అన్సారీ(Mukhtar Ansari) మృతి కేసులో న్యాయ విచారణకు ఆదేశించారు. యూపీలోని బండాకు చెందిన చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అన్సారీ మృతి కేసులో దర్యాప్తు చేపట్టి, నెల లోగా రిపోర్టును ఇవ్వాలని సీజేఎంను కోర్టు కోరింది. ముక్తార్ అన్సారీ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ తెలిపారు. తమ తండ్రి భౌతిక కాయానికి ఎయిమ్స్ వైద్యుల చేత పోస్టుమార్టమ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బండా వైద్యులపై తనకు నమ్మకం లేదన్నారు.
ఉత్తర ప్రదేశ్లోని బాందా వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ ముక్తార్ తుది శ్వాస విడిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కౌశల్ తెలిపారు. బాందా జైలులో ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడదని పోలీసులు ఆదేశించారు. ముక్తార్ అన్సారీపై 60 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఆయనకు శిక్షలు పడటం 2022 సెప్టెంబరు నుంచి ప్రారంభమైంది. ఎనిమిది కేసుల్లో వేర్వేరు కోర్టులు శిక్ష విధించాయి.