న్యూఢిల్లీ, మే 19 : ప్రధాని మోదీ స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో సోమవారం జరిగిన సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ పత్రికా ప్రకటనలు చేసిన తర్వాత ఆ దేశ మీడియా ప్రతినిధి ఒకరు తాము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మోదీని కోరారు. అయితే అందుకు స్పందించని మోదీ తన నార్వే సహచరుడితో కలసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికారంగం నుంచి కొన్ని ప్రశ్నలను మీరు ఎందుకు స్వీకరించరు? అంటూ హెలె లింగ్ అనే మహిళా జర్నలిస్టు ప్రధాని మోదీని అడగడం వీడియోలో వినపడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నేను ఆయన బదులిస్తారని కూడా ఆశించలేదు అని నార్వేజియన్ వార్తాపత్రిక డాగ్సావిసెన్లో వ్యాఖ్యాతగా తనను తాను పరిచయం చేసుకున్న లింగ్ తన ఎక్స్ అకౌంట్లో రాశారు. ఆమె ఆ వీడియోను కూడా పోస్టు చేశారు.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 157వ స్థానంలో పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాలతో పోటీ పడుతున్నది అని రిపోర్ట్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్లను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. మనం సహకరించే శక్తులను ప్రశ్నించడం మన బాధ్యత అని కూడా ఆమె రాసుకొచ్చారు. అయితే లింగ్ వ్యాఖ్యలపై ఓస్లోలోని భారత ఎంబసీ ఎక్స్ వేదికగా స్పందించింది. ప్రధాని మోదీ నార్వే పర్యటనపై విదేశాంగ శాఖ ఇచ్చే ప్రెస్ బ్రీఫింగ్కు హాజరు కావలసిందిగా లింగ్ని ఎంబసీ ఆహ్వానించింది. కాగా, శనివారం నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్తో ప్రధాని మోదీ జరిపిన సమావేశంపై విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి(పశ్చిమ) సీబీ జార్జ్ ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా హేగ్లోని ఒక డచ్ జర్నలిస్టు కూడా ఇదే విషయాన్ని పస్తావించారు.