న్యూఢిల్లీ : జోర్డాన్లో ఓ రెస్టారెంట్ కస్టమర్లకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. అధిక కొవ్వులతో కూడిన హెవీ మీల్గా పేరిందిన దేశీ డిష్ మన్సాఫ్ను ఆరగించిన అనంతరం కస్టమర్లు నిద్రించేందుకు ఈ రెస్టారెంట్ ఏర్పాట్లు చేసిందని అరబ్ న్యూస్ వెల్లడించింది. మన్సాఫ్లో కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండటంతో ఈ ఆహారం తీసుకున్న వెంటనే చాలా మందిలో నిద్ర మత్తు ఆవహిస్తుంది. దీంతో జోర్డాన్ రాజధాని అమన్లోని మువబ్ రెస్టారెంట్ ఈ వంటకాన్ని తిన్న కస్టమర్లు నిద్రించేందుకు పడకలను ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకూ మన్సాఫ్ ప్రియులు ఇంటి వద్దనే ఈ డిష్ను ఆరగించేందుకు మొగ్గుచూపేవారు. ఈ వంటకాన్ని ఆరగించిన తర్వాత వెంటనే కునుకుతీసేందుకు వారి ఇండ్లలో వెసలుబాటు ఉండటమే ఇందుకు కారణం. అయితే మన్సాఫ్ను ఆస్వాదించిన తర్వాత కస్టమర్లకు కునుకు తీసే అవకాశం కల్పించామని, రెస్టారెంట్లో దీనికోసం తగిన వాతావరణం కల్పిస్తూ బెడ్స్ ఏర్పాటు చేశామని రెస్టారెంట్ యజమాని ముసబ్ ముబిద్దీన్ చెప్పుకొచ్చారు.
ఈ డిష్ తిన్న తర్వాత కస్టమర్లకు నిద్ర ముంచుకొస్తుందని అందుకే రెస్టారెంట్లోనే వేరుగా ఈ ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. గొర్రె మాంసం, బియ్యం, నెయ్యితో తయారు చేసే మన్సాఫ్లో కొవ్వు అధికంగా ఉంటుంది. లేటెస్ట్ సాంగ్స్ వింటూ ఏసీ హాల్స్లో కస్టమర్లు హాయిగా కునుకు తీయవచ్చని, తమ రెస్టారెంట్లో కేవలం ఈ డిష్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని ముబిద్దీన్ తెలిపారు.
Read More :