ఒకే కోర్సు స్వదేశంతోపాటు విదేశంలోనూ
ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం
ట్విన్నింగ్, జాయింట్, డ్యూయల్ డిగ్రీలు
విద్యాసంస్థల మధ్య ఒప్పందాలకు అవకాశం
యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్కుమార్ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ): ఇప్పటివరకూ ఒక విద్యార్థి ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తిచేయవచ్చు. కాని ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పిస్తున్నది.
ఉన్నత విద్యలో ట్విన్నింగ్ డిగ్రీ, జాయింట్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీల కోర్సులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన యూజీసీ 557 కమిషన్ సమావేశంలో ఈ డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఒకే డిగ్రీని మన దేశంతో పాటు, ఇతర దేశాల్లో సైతం పూర్తిచేసే అవకాశం ఉండగా, ఇలా చదివిన వారు తమ క్రెడిట్స్ను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేసుకోవచ్చు.
ట్విన్నింగ్, జాయింట్, డ్యూయల్ డిగ్రీల కోసం నిబంధనలు ఇవే..
30 శాతం క్రెడిట్స్
ట్విన్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక విద్యార్థి ఫిజికల్గా ఒకటి లేదా.. రెండు సెమిస్టర్లను విదేశాల్లో పూర్తిచేసుకోవచ్చు. ఇలా 30 శాతానికి పైగా క్రెడిట్స్ను ఫారిన్లో పూర్తిచేసుకోవచ్చు. విదేశీ విద్యార్థులు సైతం మన దేశానికి వచ్చి 30 శాతం క్రెడిట్స్ను పూర్తి చేసుకోవచ్చు. డిగ్రీని మన దేశంలోని యూనివర్సిటీయే అందజేయనుండగా, విదేశాల్లో పూర్తిచేసిన క్రెడిట్స్కు సంబంధించిన సర్టిఫికెట్ను విదేశాల్లోని యూనివర్సిటీ అందజేస్తుంది. డ్యూయల్ డిగ్రీ ప్రొగ్రాం కోసం రెండు విద్యాసంస్థలు పరస్పరం ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్య అంతర్జాతీయీకరణకు మార్గం
మన విద్యార్థులు విదేశాలకెళ్లడం, విదేశీ విద్యార్థులు మన దేశానికి వచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది. అంతర్జాతీయంగా ఉన్న విద్యా ప్రమాణాలను, కోర్సులను మన విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు. విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్తో పాటు, ఉత్తమ విధానాలను అనుసరించే అవకాశముంటుంది. యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే విద్యాసంస్థలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ సంబంధిత రాష్ర్టాల ఉన్నత విద్యామండలి లేదా, ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫీజులపై భాగస్వామ్య విద్యాసంస్థలు నిర్ణయం తీసుకుని, అడ్మిషన్ల సమయంలో ప్రకటించాలి. ఎంత మంది విద్యార్థులను అనుమతించాలనే అంశంపైనా సంబంధిత విద్యాసంస్థలే అంగీకారానికి రావాల్సి ఉంటుంది. యూనివర్సిటీల అటెండెన్స్ పాలసీ ప్రకారం విద్యార్థులు తరగతులకు హాజరవ్వాలి.
–జగదీశ్కుమార్, యూజీసీ చైర్మన్