బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ను తానేమీ విమర్శించను అని అంటూనే కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ విశేషమైన పనులు చేస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదనిపెదవి విరిచారు. అయితే బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ ఏదైనా పనికి పూనుకుంటే మాత్రం తమకు వచ్చిన అభ్యంతరమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
మహరాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో తమ పొత్తు ఖాయమైందని మమత ప్రకటించారు. తమతో పొత్తు పెట్టుకోడానికి కాంగ్రెస్ ముందుకు రాకుంటే, ఇక ఏ పార్టీ ముందుకు రాదన్న భ్రమలో కాంగ్రెస్ ఉండిపోయిందని, కానీ ఎంజీపీ ముందుకు వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ఆలోచనా విధానం నుంచి కాంగ్రెస్ బయటపడితే బాగుంటుందని సూచించారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకమని బీజేపీ ప్రచారం చేస్తోందని, అది శుద్ధతప్పు అని మమత స్పష్టం చేశారు.