జైపూర్ : రాజస్థాన్లోని జోద్పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పది పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందంటూ జోధ్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రాజ్కుమార్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయమందిర్, సదర్కోత్వాలి, సదర్బజార్ నగోరి గేట్, ఖండఫల్సా, ప్రతాప్నగర్, ప్రతాప్నగర్ సదర్ దేవ్నగర్, సుర్సాగర్, సర్దార్పురా పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను ప్రకటించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తతలు కొనసొగుతున్నాయి. ఈ క్రమంలోనే జోధ్పూర్లోని మార్కెట్లన్నీ మూతపడ్డాయి. జోధ్పూర్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. జలోరి గేట్ వద్ద పరిస్థితి అదుపులోనే ఉండగా.. పలు ప్రదేశాల్లో నినాదాలు, గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఘటనపై రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో ఔరంగజేబీ మనస్తత్వం ఎలా ప్రబలంగా మారిందో జోధ్పూర్ ఘటనతో స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బల్ముకుంద్ బిస్సా విగ్రహం నుంచి జెండాను దించి జలోరీ గేట్ వద్ద ప్రత్యేక జెండాను ఆవిష్కరించడం, ఆపై రాళ్లదాడి చేయడం అధికార రక్షణ లేకుండా సాధ్యం కాదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. జోధ్పూర్లో ఇరువర్గాల మధ్య కొందరు ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే పరిస్థితిని సమీక్షించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు హింసాత్మక ఘటనలో రాజస్థాన్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.