న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆర్థిక మాంద్యం భయంతో ఉద్యోగాల కోతకు దిగుతున్న కంపెనీల జాబితాలో ప్రముఖ వెబ్ హోస్టింగ్ కంపెనీ ‘గోడాడీ’ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పని చేస్తున్న 8 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నట్టు సంస్థ సీఈవో అమన్ భుటానీ ప్రకటించారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య దాదాపు 500 వరకు ఉంటుందని తెలుస్తున్నది. వీరికి స్థానిక నిబంధనలు తగ్గట్టుగా పరిహారాన్ని అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫార్మ్ ‘జూమ్’ కూడా 1,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. డెల్ టెక్నాలజీస్ కూడా 6,650 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.