న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు సంబంధించి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ‘వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు అమ్మాయిలు తమకు, పురుష స్నేహితులకు మధ్య ఒక స్పష్టమైన గీత ఎలా గీసుకోవాలో తెలుసుకోవాలి!’ అని సర్క్యులర్లో పేర్కొన్నది. అబ్బాయిలు కొన్ని సార్లు కావాలని, మరికొన్ని సార్లు అనుకోకుండా ఫ్రెండ్షిప్ గీతను దాటుతుంటారని సాధారణంగా చెప్పేసింది. జేఎన్యూ సర్క్యులర్పై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మంగళవారం ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ‘కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది లైంగిక వేధింపులకు పాల్పడే వారికి.. బాధితులైన మహిళలకు కాదు’ అని స్పష్టం చేశారు.