JNU on Partition | జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో 1947లో దేశ విభజనపై అధ్యయన కేంద్రం ఏర్పాటు కానున్నది. చరిత్రలో లోపాలను భర్తీ చేసేందుకు ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శాంతిశ్రీ ధులిపూడి పండిట్ చెప్పారు. జేఎన్యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పరిధిలో ఈ అధ్యయన కేంద్రం పని చేస్తుందన్నారు. ఈ విషయమై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), కేంద్ర విద్యాశాఖలకు ప్రతిపాదన పంపామనన్నారు. దేశ విభజన సమయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న భయానక ఉదంతాలపై ఈ అధ్యయన కేంద్రం ప్రధానంగా దృష్టి సారించనున్నది. ఇదే అంశంపై యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశపెడతామని శాంతిశ్రీ ధులిపూడి పండిట్ అన్నారు.
దేశంలోని శరణార్థుల స్థితిగతులు, బలవంతంగా వలస వచ్చిన వారి పరిస్థితులపై అధ్యయనానికి ఈ అధ్యయన కేంద్రం సహాయ పడుతుందని శాంతి శ్రీ ధులిపూడి పండిట్ తెలిపారు. దక్షిణాసియా ప్రాంతంలో దేశ విభజన ప్రభావంపై అధ్యయనం చేయడానికి వీలుగా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పరిధిలో ఈ స్టడీ సెంటర్ ఉంటుందన్నారు.
సాధారణ ప్రజల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించాలని తాము కోరుతున్నామని శాంతిశ్రీ ధులిపూడి పండిట్ తెలిపారు. ఈ అంశంపై ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్లు తాత్కాలికం అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దేశ విభజన బాధితుల అనుభవాలు తెలుపాలని కోరుతూ లేఖలు రాస్తామని చెప్పారు.