COVID JN.1 | రాబోయే నాలుగు వారాల్లో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే, జనవరి తొలివారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సాకాగ్ (INSACOG) నివేదికపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్లో కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్కు చెందిన ఐదుగురు వ్యక్తుల నమూనాలను జెనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. జేఎన్.1 సబ్ వేరియంట్గా తేలింది.
ఇప్పటి వరకు జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 69కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గోవాలో 34 మంది, కర్నాటకలో 8 మంది, కేరళలో ఆరుగురు, మహారాష్ట్రలో తొమ్మిది మంది, రాజస్థాన్లో ఐదుగురు, తమిళనాడులో నలుగురికి, తెలంగాణలో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. క్రిస్మస్, న్యూయర్ వేడుకలు పూరయ్యాక రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020-22 సంవత్సరాల మధ్య కరోనా ట్రెండ్ను సమీక్షించగా.. జనవరిలో కొవిడ్ కేసుల పెరుగుదల కనిపించింది. ఒమిక్రాన్ కారణంగా డిసెంబర్-జనవరి మధ్య గతేడాది కొవిడ్ రోజువారీ కేసులు పెరిగాయి. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జేఎన్.1 వేరియంట్ సబ్ ఫామ్ సైతం వ్యాప్తి చెందుతున్నది.
దీని ఆర్ విలువ అంటే.. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ కారణంగా జనవరి మొదటి వారంలో కేసులు భారీగా పెరిగితే.. మరో మూడువారాలు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎంతకాలం స్థిరంగా ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల మార్క్ను దాటింది. ఇందులో అత్యధికంగా కేసులు 3వేలకుపైగా కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.