Jarkhand: జార్ఖండ్ నూతన సీఎం చంపాయ్ సోరెన్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముసలం పుట్టింది. ప్రస్తుతం క్యాబినెట్ బెర్తులు దక్కించుకున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమ సమస్యను పార్టీ హైకమాండ్కు వినిపించేందుకు ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.
జార్ఖండ్లో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటయ్యింది. జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన సర్కారులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్లకు మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇటీవల భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేయడంతో.. ఆయన పదవికి రాజీనామా చేశారు.
దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపాయ్ సోరెన్ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు పాత మంత్రులకే మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై మిగతా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.
తాము తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి సమస్యను చెప్పుకుంటామని తెలిపారు. ఢిల్లీకి బయలుదేరే ముందు మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు, రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన బసంత్ సోరెన్ను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని తెలియజేశారు. మరోవైపు అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ముందే జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ కూడా ఢిల్లీకి వెళ్లారు.