న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోవిడ్ 19 అంతర్జాతీయ వెబ్సైట్లో భారత్ మ్యాప్ను తప్పుగా చూపారు. జమ్ముకశ్మీర్ను విడిగాను, పాకిస్థాన్, చైనాకు చెందినట్లుగా కర్సర్ హైలైట్ చేస్తున్నది. పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతాను సేన్ దీనిని గుర్తించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. Covid19.WHO.int వెబ్సైట్లోని ప్రపంచ పటంలో జమ్ముకశ్మీర్ను చైనా, పాకిస్థాన్లో భాగంగా చూపుతున్నారని అందులో పేర్కొన్నారు.
ఈ సైట్లోని ప్రపంచ పటంలో భారతదేశం నీలం రంగులో, జమ్ముకశ్మీర్ మరో రంగులో ఉన్నదని టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ తెలిపారు. నీలం రంగుపై క్లిక్ చేస్తే భారత్ కరోనా డేటా, జమ్ముకశ్మీర్లోని పెద్ద భాగంలో పాకిస్థాన్ డేటా, చిన్న భాగంలో చైనా డేటాను చూపుతున్నారని చెప్పారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ను కూడా విడిగా చూపారని, ఇది చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిని తీవ్రమైన అంతర్జాతీయ సమస్యగా తాను నమ్ముతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.
ప్రముఖమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కరోనా వెబ్సైట్లో భారత దేశ మ్యాప్ ఈ విధంగా ఉండటం దేశ పౌరులకు సిగ్గుచేటని ఎంపీ శాంతాను సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని సరిదిద్దే చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు ఈ తప్పును ఎందుకు గ్రహించలేదో అన్నది వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా దేశ వ్యవహారాల నేపథ్యంలో ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలని ప్రధానికి రాసిన లేఖలో ఆయన సూచించారు.