శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని హైదర్పురాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు వ్యాపారవేత్తలను అన్యాయంగా కాల్చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఇద్దరూ అమాయకులని వాళ్ల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆ వివాదాస్పద ఎన్కౌంటర్పై విచారణకు ఆదేశించింది. అదనపు జిల్లా మెజిస్ట్రేట్తో పోలీసు ఆపరేషన్పై విచారణ చేపట్టనున్నట్లు జేకే ప్రభుత్వం తెలిపింది. అయితే ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆ ఇద్దరికీ ఉగ్రవాదులతో లింకు ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా హైదర్పురా ఎన్కౌంటర్పై విచారణ నిర్వహిస్తామని జేకే డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
పోలీసులు నిర్వహించిన ఎన్కౌంటర్లో వ్యాపారవేత్త ఆల్తాఫ్ భట్, డెంటల్ సర్జన్ ముదసిర్ గుల్ మృతిచెందారు. హైదర్పురాలో ఉగ్రవాదుల ఏరివేత సమయంలో ఈ ఇద్దరు కూడా పోలీసుల తూటాలకు బలయ్యారు. అయితే ఆ ఇద్దర్నీ ఉగ్రవాదులే చంపినట్లు తొలుత పోలీసులు చెప్పారు. మళ్లీ మాట మార్చిన పోలీసులు.. ఆ ఇద్దరూ ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు వెల్లడించారు. ఉగ్రవాదులతో లింకు ఉన్నట్లు ఆ ఇద్దరిపై ఆరోపణలు చేశారు. దీంతో కుటుంబసభ్యులు ధర్నా చేపట్టారు.