శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్స్ 370, 35ఏ రద్దును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర నేతలు గళమెత్తారు. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆర్టికల్ 370, 35ఏతోపాటు జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయం, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పడం స్వాగతించదగిన చర్య అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఎన్నికల బలవంతం, ఎన్నికలలో ఓటమి భయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె విమర్శించారు. ఓట్ల కోసం దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలను సంతోషపెట్టాల్సిన అవసరం బీజేపీకి ఉన్నప్పటికీ, కశ్మీరీలను శిక్షించడం, అవమానించడం వల్ల వారి ప్రధాన ఓటు బ్యాంకును సంతృప్తిపరుస్తుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ ఓటర్లను సంతోషపెట్టడానికే జమ్ముకశ్మీర్ విచ్ఛిన్నం, నిర్వీర్యంతోపాటు భారత రాజ్యాంగాన్ని అపవిత్రం చేశారని ముఫ్తీ ఆరోపించారు. ఇప్పటికైనా దీనిని సరిచేస్తారని, 2019 ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్లో చేసిన చట్టవిరుద్ధమైన మార్పులను వెనక్కి తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, ఆర్టికల్ 370, 35ఏ, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) చైర్పర్సన్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మూడు వివాదాస్పద చట్టాలను రద్దు చేసే వరకు రైతులు తమ నిరసనను కొనసాగించాలని ఆయన సూచించారు.