జమ్మూ: జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ హేమంత కుమార్ లోహియా హత్య కేసులో నిందితుడు యాసిర్ అహ్మద్ను పోలీసులు పట్టుకున్నారు. లోహియా ఇంట్లో 23 ఏళ్ల యాసిర్ పనిమనిషిగా చేశాడు. డీజీ లోహియా హత్య కేసులో అతన్ని విచారిస్తున్నట్లు ఏడీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. గత రాత్రి ఇంట్లో సీనియర్ ఆఫీసర్ లోహియా అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. నిందితుడు ఆయన గొంతును కోశాడు. శరీరంపై కాలిన గాయాలూ ఉన్నాయి. జమ్మూ శివారు ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్ ఇంట్లో లోహియాను మర్డర్ చేశారు. స్వంత ఇంట్లో రిపేర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో .. ప్రస్తుతం లోహియా తన ఫ్యామిలీతో కలిసి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాడు. కశ్మీర్ జైళ్లశాఖ డీజీగా లోహియా ఆగస్టులో నియమితులయ్యారు.
డిప్రెషన్లో యాసిర్..
సెక్యూర్టీ ఫూటేజ్ ఆధారంగా ఈ హత్య కేసులో పనిమనిషి యాసిర్పై అనుమానం వ్యక్తం చేశారు. గత కొన్నాళ్ల నుంచి యాసిర్ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసు ఆఫీసర్ ముకేశ్ సింగ్ తెలిపారు. యాసిర్కు చెందిన పర్సనల్ డైరీని గుర్తించారు. మరణం గురించి అతను తన డైరీలో రాసుకున్నట్లు ఉంది. డియర్ డెత్.. కమ్ ఇన్టూ మై లైఫ్ అని ఓ నోట్పై రాశాడతను. హిందీ పాటల్ని కూడా డైరీలో రాసుకున్నాడు. కొన్ని పేజీల్లో తన జీవితంపై ఉన్న విరక్తిని వ్యక్తం చేశాడు. జీవితాన్ని అసహ్యించుకుంటున్నట్లు రాసుకున్నాడు. తన జీవితంలో లవ్ జీరో శాతం, టెన్షన్ 90 శాతం, బాధ 99 శాతం, నకిలీ చిరునవ్వు100 శాతం ఉన్నట్లు మరో పేజీలో రాశాడు. తాను గడుపుతున్న జీవితంతో ఎలాంటి సమస్య లేదని, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న సమస్య ఉన్నట్లు మరో పేజీలో రాసుకున్నాడు.