ముంబై: జియో ఎయిర్ ఫైబర్పై ముఖేశ్ అంబానీ పెద్ద అప్డేట్ ఇచ్చారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జియో ఎయిర్ ఫైబర్(Jio AirFiber) అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ అధినేత తెలిపారు. గణేశ్ చుతుర్ధి సందర్భంగా ఎయిర్ ఫైబర్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా రోజు 15వేల కనెక్షన్లు ఇవ్వగలమని, కానీ జియో ఫైబర్ ద్వారా ఈ కనెక్షన్ల సంఖ్యను లక్షా 50 వేలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. 5జీ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా డేటాను జియో ఎయిర్ ఫైబర్ అందిస్తుంది.
46వ వార్షిక సమావేశాలను ఉద్దేశిస్తూ ఆయన ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గడిచిన పదేళ్లలో రిలయన్స్ సంస్థ 150 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిందన్నారు. కొత్త ఇండియా పూర్తి ఆత్మస్థయిర్యంతో ఉందని, ఈ ఇండియాను ఎవరూ ఆపలేరని, ఓ లీడింగ్ దేశంగా ఇండియా ఎదుగుతుందని, జీ20 సమావేశాలకు ఇండియా వేదిక కావడం చరిత్రాత్మకం అని ఆయన అన్నారు.
గత అక్టోబర్లో 5జీ సేవల్ని స్టార్ట్ చేశామని, ఇప్పుడు ఆ సేవలు 96 శాతం పట్టణాల్లో అందుబాటులో ఉందని, ఈ ఏడాది డిసెంబర్లోగా ఆ సేవల్ని యావత్ దేశానికి అందేలా చూస్తామని రిలయన్స్ అధినేత తెలిపారు. రిలయన్స్ ఎగుమతులు ఈ ఏడాది 33.4 శాతం పెరిగాయని, అది 3.4 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. జియో నెట్వర్క్ ద్వారా ప్రతి నెలకు దేశవ్యాప్తంగా 1100 కోట్ల జీబీ డేటాను వాడుతున్నట్లు ఆయన చెప్పారు.