న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని ఖర్గే ఆరోపించారు.
దేశంలో పార్లమెంట్లోపలగానీ, పార్లమెంట్ బయటగానీ వాక్ స్వాతంత్య్రం లేదని ఖర్గే మండిపడ్డారు. ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వాళ్లను జైలుకు పంపుతున్నారని విమర్శించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ అప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, పేదరికం పెరుగుతూనే ఉన్నదని దుయ్యబట్టారు.
సాహెబ్గంజ్ జిల్లా పాకూర్ పట్టణంలోని గుమానీ గ్రౌండ్లో 60 రోజులపాటు కొనసాగే హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన ప్రసంగించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి వివరించనున్నారు.