రాంచీ: నాలుగేండ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఒక వ్యక్తి కరోనా టీకాతో కోలుకున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తన కాళ్లలో కదలిక వచ్చిందని తెలిపాడు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్చంద్ పక్షవాతం కారణంగా సుమారు 4 సంవత్సరాలుగా మంచంపైనే ఉన్నాడు. కాగా, అతడు ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. అయితే కోవిషీల్డ్ డోస్ తీసుకున్న తర్వాత పక్షవాతం పోయిందని దులార్చంద్ తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి నా కాళ్లలో కదలిక వచ్చింది’ అని చెప్పాడు.
మరోవైపు ఈ సంగతి తెలుసుకున్న డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాలుగు ఏండ్లగా పక్షవాతంతో ఉన్న వ్యక్తి టీకా తీసుకున్న తర్వాత ఆకస్మాత్తుగా కోలుకోవడం నమ్మశక్యంగా లేదని బొకారోకు చెందిన సివిట్ జర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ అన్నారు. శాస్త్రీయంగా దీనిని నిర్ధారించాల్సి ఉందని ఆయన చెప్పారు.
కాగా, కరోనా టీకా తీసుకున్న తర్వాత తమకు కంటి చూపు వచ్చిందని, వినికిడి లోపం పోయిందంటూ గతంలో కూడా పలువురు వ్యక్తులు పేర్కొన్నారు.