రాంచీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)కు చెందిన ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. (ISIS men Arrest) వీరిలో ఒకరు ఫిదాయిగా పాలస్తీనాకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొంది. జార్ఖండ్లో ఈ సంఘటన జరిగింది. గొడ్డాలోని రహ్మత్ నగర్లో నివాసముంటున్న అరిజ్ హస్నైన్, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్)కు సమాచారం అందింది. దీంతో బుధవారం అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారు.
కాగా, ఐఎస్ఐఎస్తో సంబంధం ఉన్న హజారీబాగ్ జిల్లాకు చెందిన మహ్మద్ నసీమ్ గురించి అరిజ్ బయటపెట్టాడు. ఐఎస్ సిద్ధాంతాన్ని సమర్థించే రెండు పుస్తకాలు తనకు పంపినట్లు చెప్పాడు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులతో కూడా నసీమ్ టచ్లో ఉన్నాడని వెల్లడించాడు. దీంతో నసీమ్ కూడా ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అరిజ్ పాలస్తీనాకు వెళ్లి అల్ అక్సా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి చేయాలనుకున్నాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. అతడి మొబైల్లో ఉన్న అనుమానిత చాట్స్ ద్వారా ఈ విషయం తెలిసిందని వివరించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన వాజిహుద్దీన్, దుర్గ్ జిల్లాలోని స్మృతి నగర్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో యూపీ ఏటీఎస్ అక్కడకు వెళ్లి ఛత్తీస్గఢ్ పోలీసుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.