JEE Main | హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు గత నెలలో ఎన్టీఏ ప్రకటించింది. అయితే పలు కారణాల రీత్యా ఈ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం మార్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ పేపర్ -1 (బీఈ/బీటెక్ ) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనున్నాయి. పేపర్-2 పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. పేపర్ -1 పరీక్ష రెండు పూటలు (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) జరుగనుంది. అలాగే, పేపర్-2 పరీక్ష ఒంటిపూట (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) మాత్రమే నిర్వహించనున్నారు. అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్ సైట్ లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, కోర్సు, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ www.nta.ac.in ను సంప్రదించాలన్నారు.
Advance Intimation for Allotment of Examination City to the Applicants of Joint Entrance Examination (Main) – 2024 Session 2 pic.twitter.com/6PUxth7fdi
— National Testing Agency (@NTA_Exams) March 28, 2024