JEE Main 2023 | దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్ 2023 ( JEE – Main 2023 ) షెడ్యూల్ వచ్చేసింది. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు దశల్లో జేఈఈ-మెయిన్ 2023 పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ-మెయిన్ పరీక్ష జరుగుతుంది. తొలి దశ ఎంట్రన్స్ కోసం గురువారం నుంచి వచ్చే నెల 12 తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చేనెల 12 అర్థరాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించొచ్చు. అభ్యర్థులు Jeemain.nta.nic.in అనే వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, దేశంలో ప్రసిద్ధి చెందిన ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్క్ వంటి కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఈ పరీక్షలకు ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో టాప్లో నిలిచిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో టాప్ రాంకర్లుగా నిలిచిన వారికి ఐఐటీల్లో అడ్మిషన్ లభిస్తుంది.
తొలి దశ జేఈఈ మెయిన్ పరీక్ష వచ్చేనెల 24, 25,27,28,29,30,31 తేదీల్లో, రెండో సెషన్ ఏప్రిల్ 6,7,8,9,10,11,12 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 13 భాషలు.. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, అసోమీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడం, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ్, ఉర్దూ, ఒడియా భాషల్లో రాయొచ్చు. తొలి సెషన్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు జనవరి రెండోవారంలో ఎగ్జామ్ సెంటర్ ప్రకటిస్తారు. మూడో వారంలో అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.