హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4న పరీక్ష జరగనున్నది. ఈ మేరకు గురువారం ఐఐటీ గువాహటి షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం.. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి మే 4 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 వరకు వెసులుబాటు కల్పించారు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2023 ఏడాదికి గాను ఐఐటీ గువాహటి ఈ పరీక్ష నిర్వహిస్తుండటంతో ప్రత్యేక బ్రోచర్ను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్ -1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ తప్పనిసరిగా రాయాలి.
తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ సెంటర్లలో పరీక్ష జరగనున్నది. జూన్ 4న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఐఐటీ గువాహటి తెలిపింది. అయితే.. జేఈఈ మెయిన్-2023 పరీక్ష తేదీలను ఇప్పటికే ఎన్టీఏ విడుదల చేసింది. తొలి సెషన్ను జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు పేరొంది.
జేఈఈ మెయిన్ తేదీలు మార్చండి: ఎన్సీపీసీఆర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: జేఈఈ మెయిన్ 2023 తేదీలు మార్చాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) కోరింది. తేదీలను ప్రకటించిన నెలకే పరీక్ష నిర్వహించటం తగదని తెలిపింది. అటు.. పరీక్షకు 75 శాతం అర్హతను కూడా తొలగించాలని కోరింది.