JDU | పాట్నా : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం.
ఈ నేపథ్యంలో బీహార్లో తమకు 17 ఎంపీ స్థానాలను కేటాయించాలని జేడీయూ నాయకుడు, బీహార్ మంత్రి అశోక్ చౌదరి డిమాండ్ చేశారు. 16 స్థానాల్లో జేడీయూ ఎంపీలు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో 17 ఎంపీ స్థానాలను కేటాయించాలన్నారు. 17 స్థానాలకు తక్కువ కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని అశోక్ చౌదరి తేల్చిచెప్పారు. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి బలపడుతుందని, అందులో అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 22న అయోధ్యకు నితీశ్ కుమార్ వెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు.. ఆయన అన్ని మతాలను గౌరవిస్తారని అశోక్ చౌదరి చెప్పారు.