ఇంఫాల్, జూన్ 6: మణిపూర్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని తీవ్రవాద గ్రూపులు రెచ్చిపోతున్నాయి. మంగళవారం ఉదయం సెరోయి ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపుపైనే మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారు. ఈనేపథ్యంలో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా, అస్సాం రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కుకీ తిరుగుబాటు వర్గానికి చెందిన మిలిటెంట్స్ ఈ కాల్పులకు తెగబడ్డారని మణిపూర్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాక్చింగ్ జిల్లా సుగ్నులోని ఓ పాఠశాలకు సమీపంలో బీఎస్ఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకొని తెల్లవారుజామున 4.15 గంటలకు మిలిటెంట్స్ కాల్పులకు దిగారని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు విలేకరులకు చెప్పారు.
కాల్పుల ఘటనలో కానిస్టేబుల్ రంజిత్ యాదవ్ తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదిలా ఉండగా, పశ్చిమ ఇంఫాల్లో ఫ్యాయెంగ్లోనూ కుకీ మిలిటెంట్స్, భద్రతా బలగాల మధ్య మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెప్పారు. కాగా, మరో 10రోజులపాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మొబైల్డాటా, బ్రాడ్బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి.
మిజోరం, అస్సాంలో 10వేలమందికి ఆశ్రయం
హింస, దాడుల నేపథ్యంలో నిరాశ్రయులైన 10,700మంది మణిపూర్ ప్రజలకు అస్సాం, మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం కల్పించినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నిరాశ్రయులైన వారిలో అత్యధికులు గిరిజనులే ఉన్నారని, వీరిని మిజోరంలోని 10జిల్లాలకు తరలించామని చెప్పారు. కోల్సాబీ జిల్లాలో 3481మంది, ఐజ్వాల్లో 3157మంది, సైతువాల్లో 2390మంది తలదాచుకునేందుకు అన్ని వసతులు ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మణిపూర్ నిరాశ్రయుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్టు మిజోరం ప్రభుత్వం తెలిపింది.