రాంచీ : స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) ఇక లేరు. జంషెడ్పూర్లోని టాటా మెయిన్ హాస్పిటల్లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై టాటా స్టీల్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేసింది. జంషెడ్ ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకుపైగా భారతీయ పరిశ్రమకు, టాటాలకు విశేషమైన సేవలందించారు. ఆయన 1963లో బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్, షెఫీల్డ్లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా తన కెరీర్ను ప్రారంభించారు.
1968లో భారత్కు తిరిగి వచ్చిన తర్వాత, టాటా స్టీల్లో డైరెక్టర్ (R&D)కి అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టారు. 1979లో జనరల్ మేనేజర్గా, 1985లో ప్రెసిడెంట్గా నియామకమయ్యారు. 1992లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి జూలై 2001 వరకు ఆ పదవిలో కొనసాగారు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి జియాలజీలో ఎంఎస్సీ, యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ నుంచి డాక్టరేట్ సర్టిఫికేట్ పొందారు. ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇరానీ మృతిపై జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా సంతాపం ప్రకటించారు. సమర్థుడైన గొప్ప నాయకుడిగా ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారన్నారు.