శ్రీనగర్: భద్రతా బలగాలకు పెను ముప్పు తప్పింది. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించాయి. జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ఉగ్రవాది అనుచరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐదారు కిలోల ఐఈడీని (IED recovery) ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. అరిగామ్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాది అనుచరుడు ఇష్ఫాక్ అహ్మద్ వానీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. అతడు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఒక చోట దాచిన పేలుడు పదార్థాలైన ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, రాజౌరిలోని కంది అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడం గమనార్హం. మరోవైపు ఆ అటవీ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకున్నాయి. అక్కడ నక్కిన ఉగ్రవాదుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆదివారం నాటికి ఈ సెర్చ్ ఆపరేషన్ మూడో రోజుకు చేరిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.