న్యూఢిల్లీ: మన దేశంలో నదీ జలాల పారిశుధ్యతపై దృష్లి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో ఒక పడవపై కొందరు నదీ విహారం చేస్తున్నారు. ఆ ఫొటో ప్రత్యేకత ఏమిటంటే.. అందులో ఉన్న నది భూభాగం సైతం స్పష్టంగా కనిపిస్తోంది. నది అట్టడుగున ఉన్న పచ్చదనం, రాళ్లు ఆ ఫొటో అందాన్ని మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ఆ ఫొటో తీసిన విధానం చూస్తే ఆ పడవ నీటిపై కాదు గాలిలో తేలియాడుతుందేమోనన్న భ్రమ కలగుతుంది. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఏ నదో తెలుసా?.. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మెఘాలయాలో ఉన్న ఉంగోట్ నది.
ఆ నది అందాన్ని, పరిశుభ్రతను పొగుడుతూ జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. అందులో నదిని కాలుష్యం బారిన పడకుండా శభ్రంగా కాపాడినందుకు.. మేఘలయ ప్రజలకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసింది. ఉంగోట్ నది మేఘలయా రాజధాని షిల్లోంగ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నది ప్రపంచంలోనే అందమైన నదులలో ఒకటిగా ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఫొటో చూసిన కొందరు నెటిజెన్లు ఆ నది అందాన్ని పొగుడుతుంటే.. మరికొందరు మాత్రం ఇది నిజమేనా.. లేక ఫొటోషాప్ చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జలశక్తి ఫోటో షేర్ చేసిన ఫోటోలో ఉన్న బోట్పై అయిదుగురు ప్రయాణిస్తున్నారు. ఆ ఫోటోకు ఇప్పటికే 19వేల లైక్లు, మూడు వేల రీట్వీట్లు వచ్చేశాయి. ఓ వ్యక్తి తన ట్వీట్లో యమునా నది ఎప్పుడు ఇలా అవుతుందని ప్రశ్నించాడు. కాలుష్యం తక్కువగా ఉన్న కారణంగా.. నది ఇలా మిలమిలలాడుతోందని మరోవ్యక్తి ట్వీట్ చేశాడు.