న్యూఢిల్లీ: భారత్ సందర్శనకు వచ్చిన సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరు చర్చించారు. కరోనాపై ఉమ్మడి పోరాటం, గల్ఫ్, ఇండో-పసిఫిక్తోపాటు ఆఫ్ఘనిస్థాన్పై ఉపయోగకరమైన అభిప్రాయాల మార్పిడి జరిగిందని జైశంకర్ తెలిపారు. సౌదీ అరేబియాకు నేరుగా విమానాలను పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు.
కాగా, 2019 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ పర్యటన సందర్భంగా భారత్, సౌదీ అరేబియా మధ్య సంతకం చేసిన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందం అమలును కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రత, సంస్కృతి, కాన్సులర్ సమస్యలు, ఆరోగ్య సంరక్షణ, మానవ వనరులలో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరువురు మంత్రుల నేతృత్వంలోని ప్రతినిధులు చర్చలు జరిపినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.