తిరువనంతపురం : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ప్రధాన కార్యదర్శి ఇన్చార్జ్ పీఎంఏ సలాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల తరగతి గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలను పక్కపక్కన కూర్చునేందుకు అనుమతించడం ప్రమాదకరమని హెచ్చరించారు. కేరళ ప్రభుత్వం విద్యా వ్యవస్ధలో జెండర్-న్యూట్రల్ వ్యవస్ధను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్న నేపధ్యంలో సలాం ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఇది ప్రమాదకరమైన అంశం, అసులు క్లాస్రూంల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవాల్సిన అవసరం ఏముంద”ని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి అవకాశాలను వారికి బలవంతంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది సమస్యలు సృష్టిస్తుంది..చిన్నారులు చదువు నుంచి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. జెండర్ న్యూట్రాలిటీ అనేది మతపరమైన అంశం కాదని, నైతిక అంశమని సలాం చెప్పుకొచ్చారు. లింగభేదం లేకుండా విద్యార్ధలుకు ఒకే విధమైన యూనిఫాంలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది విద్యార్ధులను తప్పుదారి పట్టిస్తుందని..ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని తాము ప్రభుత్వాన్ని కోరతామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని విద్యా సంస్ధల్లో లింగ తటస్ధ భావాలను రుద్దే ప్రయత్నం విరమించుకోవాలని ముస్లిం సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. విద్యాసంస్ధల్లో ఉదార విధానాలను ప్రవేశపెట్టాలని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.