న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 1న ఘోరమైన కారు ప్రమాదంలో మరణించిన ఢిల్లీ యువతి అంజలి (20) నివాసానికి ఇవాళ మనీష్ సిసోడియా వెళ్లారు. అక్కడ అంజలి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం బయటికి వచ్చిన సిసోడియా మీడియాతో మాట్లాడారు.
అంజలి ఘోర మరణం చాలా బాధాకరమని సిసోడియా అన్నారు. ఆ ఇంటికి జీవనాధారం అంజలి ఒక్కతేనని, ఇప్పుడు ఆమె మరణంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నామని చెప్పారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతిలో ఉందని, కేంద్రం మాత్రం శాంతిభద్రతలను కాపాడకుండా తన అధికారాన్ని పూర్తిగా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికే దుర్వినియోగం చేస్తున్నదని సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.