న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ పట్ల భారత్ మౌనం వహించడం విచారకరమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. రష్యా మిత్ర దేశం కావడం వల్ల కొన్ని పరిమితులు, చట్టబద్ధమైన భద్రతా సమస్యలు ఉండవచ్చని తెలిపారు. అయితే భారత్ అకస్మాత్తుగా మౌనం దాల్చడం ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలను తీవ్ర నిరాశపర్చిందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత్ను ఉక్రెయిన్ కోరడాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చన్నారు. మన దేశంలోకి చైనా ప్రవేశిస్తే ఇతర దేశాలు మనకు అండగా ఉండాలని మనం కూడా కోరుకుంటామని అన్నారు. అదే విధంగా భారత్ రష్యాతో మాట్లాడాలని ఉక్రెయిన్ భావిస్తే, మనం కనీసం సమస్యను ఒకవైపు నుంచి అయినా పరిగణించడం లేదని విమర్శించారు.
హింస, యుద్ధం ద్వారా ఇతర దేశాల దురాక్రమణ, బలవంతంగా పాలన మార్పును సమర్ధించకపోవడంపై భారత్ కట్టుబడి ఉందని శశిథరూర్ గుర్తు చేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సీటును ఆశించే భారత్, అంతర్జాతీయ సమస్యలపై ఇలా పూర్తిగా మౌనం వహించడం మంచిది కాదన్నారు.
ఉక్రెయిన్లో సుమారు 24 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, ఇందులో కేరళకు చెందిన విద్యార్థులు 2,300 మంది చిక్కుకుపోయారని శశిథరూర్ తెలిపారు. భారత్ జోక్యం గురించి ఉక్రెయిన్లోని విద్యార్థుల నుంచి తనకు చాలా మెసేజ్లు వస్తున్నాయని చెప్పారు. అయితే గగనతలాన్ని ఉక్రెయిన్ మూసివేయడంతో భారతీయులను విమానాల్లో తీసుకువచ్చే అవకాశాలు లేవన్నారు.