ముంబై: విస్తారాకు చెందిన అబూదాబి-ముంబై విమానంలో 45 ఏళ్ల మహిళ దురుసుగా ప్రవర్తించింది. ఎకానమీ క్లాసు టికెట్ తీసుకున్న ఆ మహిళ బిజినెస్ క్లాసులో కూర్చుని హంగామా చేసింది. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసిన సిబ్బందిపై దాడి చేసిందామె. ఇక విమానంలో ఆమె అర్ధనగ్నంగా కూడా పరేడ్ చేసినట్లు విమాన సిబ్బంది ఆరోపించారు. క్యాబిన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు పావులో పెరుసియో అనే మహిళను అరెస్టు చేశారు.
ఇటలీకి చెందిన మహిళ ప్రవర్తన సరిగా లేని కారణంగా.. కెప్టెన్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారని, ఎంతకీ వినకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇతర కస్టమర్ల భద్రత దృష్ట్యా విమానంలో రెగ్యులర్గా అనౌన్స్మెంట్ చేశారని, సంస్థ మార్గదర్శకాల ప్రకారం భద్రతా దళాలకు ఈ విషయాన్ని చేరవేసినట్లు విస్తారా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు చెందిన ఇతర వివరాలను ఆ సంస్థ షేర్ చేయలేదు.
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో గత ఏడాది నుంచి ఇండియాలో విమాన సంస్థలు ప్రయాణికులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాయి.