న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ పంపీ జైన్ నివాసాల్లో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజీతో పాటు ముంబైలో ఉన్న నివాసాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. సుమారు 50 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ పమ్మీ జైన్కు సుగంధ ద్రవ్యాల కంపెనీతో పాటు పెట్రోల్ పంపులు, కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే సమాజ్వాదీ పార్టీ పర్ఫ్యూమ్ను కూడా ఆయన లాంచ్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నట్లు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అఖిలేశ్ అన్నారు.
టార్గెట్ జైన్..
కొన్ని రోజుల క్రితం కాన్పూర్కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లోనూ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సోదాల్లో సుమారు 196 కోట్ల నగదు, 23 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే పీయూష్ జైన్ కూడా పుష్పరాజ్ జైన్ తరహాలో పర్ఫ్యూమ్ వ్యాపారం చేస్తున్నాడు. పుష్పరాజ్కు బదులుగా పీయూష్ జైన్ ఇంట్లో సోదాలు జరిగినట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉన్న కారణంగా.. ఐటీ అధికారులు తప్పుగా పీయూష్ ఇంట్లో తొలుత సోదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అక్రమంగా కరెన్సీ దాచిపెట్టిన కేసులో ఇప్పటికే పీయూష్ను అరెస్టు చేశారు.
పుష్పరాజ్, పీయూష్లది ఒకే ఇంటి పేరు. ఆ ఇద్దరూ జైన్ వర్గానికి చెందినవారు. పుష్పరాజ్ జైన్ ఇంట్లో ఇవాళ ఐటీ తనిఖీలు మొదలయ్యాయి. యూపీలోని కన్నౌజ్లో ఉన్న జైన్ వీధిలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. ఇద్దరి వ్యాపారం పర్ఫ్యూమ్లే కాబ్టటి.. యూపీ ఎన్నికల వేళ ఆ ఇద్దరి పేర్లు తరుచూ వినిపిస్తున్నాయి. పుష్పరాజ్ పంపీ జైన్తో పాటు మరో పర్ఫ్యూమ్ వ్యాపారి మాలిక్ మియాన్కు చెందిన ఇండ్లు, ఫ్యాక్టరీల్లో డీసీజీఐ ఇవాళ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కన్నౌజ్ కోత్వాలి ప్రాంతంలో ఉన్న ఇండ్లల్లో తనిఖీలు జరుగుతున్నాయి.