న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో వీర్ సావర్కర్ దేశానికి ద్రోహం చేశాడని, బ్రిటిషర్స్కు సహకరించి గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి పోరాట యోధులను ఆయన మోసం చేశాడని భారత్ జోడో యాత్రలో భాగంగా చేసిన ఓ ప్రసంగంలో రాహుల్గాంధీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో మహాత్మాగాంధీ మనువడు తుషార్ గాంధీ.. రాహుల్గాంధీకి మద్దతు నిలిచారు. బ్రిటిషర్స్తో వీర్ సావర్కర్ దోస్తీ నిజమేనని చెప్పారు. జైలు నుంచి బయటకు రావడం కోసం బ్రిటిషర్స్ను క్షమాపణ కోరిన సావర్కర్.. ఆ తర్వాత వారికి సహకరించాడని తుషార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి చరిత్రలో కావాల్సినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు.
యాత్రలు అనేవి మన సంప్రదాయంలో భాగమని, ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలకు యాత్రలు పురుడుపోశాయని తుషార్గాంధీ చెప్పారు. ప్రస్తుతం దేశం మన పూర్వీకులు వేసిన మార్గానికి భిన్నంగా పోతున్నదని, దీన్ని ప్రజలు అర్థం చేసుకుని దేశాన్ని గాడిలో పెట్టడం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.