న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) కోర్సులో ప్రవేశానికి కటాఫ్ మార్కులను తగ్గించబోమన్న తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కటాఫ్ ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా 9వేల బీడీఎస్ సీట్లు భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై గతంలో సుప్రీం కోర్టు విచారించినప్పుడు.. అడ్మిషన్ ప్రక్రియ చివరి దశలో ఉందని, కటాఫ్ను తగ్గించడం కుదరదని కేంద్రం తెలిపింది. అయితే, ప్రవేశ ప్రక్రియను మే 15కు పొడిగించారు. తాజా విచారణ సందర్భంగా కోర్టు దీన్ని ప్రస్తావించింది. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కటాఫ్ తగ్గిస్తే మేలని సూచించింది. బీడీఎస్ కటాఫ్ మార్కులను తగ్గించాలని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది.